బుడమేరు వాగుపై వంతెన నిర్మాణానికి శ్రీకారం.
శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం.
రూ.75 లక్షల వ్యయంతో వంతెన నిర్మాణం.
రైతుల రాకపోకలు, పంటల రవాణాకు ఇక సౌకర్యం.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18/09/2026.
మైలవరం పట్టణంలోని నారాయణనగర్ ప్రాంతంలో బుడమేరు వాగుపై రైతుల చిరకాల సమస్యకు పరిష్కారం లభించనుంది. దశాబ్దాలుగా వర్షాకాలంలో బుడమేరు వాగును దాటి అవతలి వైపున ఉన్న తమ పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డి.ఎం.ఎఫ్ నిధులు రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న లోలెవెల్ వంతెనకు మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
నారాయణనగర్ ప్రాంతం నుంచి ప్రవహించే బుడమేరు వాగు కారణంగా ప్రతి ఏటా వర్షాకాలంలో రైతుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. వాగులో వరద ప్రవాహం పెరిగిన సమయంలో అవతలి వైపున ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లడం, పంటలను తరలించడం రైతులకు పెద్ద సవాలుగా మారేది. గతంలో వరదలను నియంత్రించేందుకు నిర్మించిన చెక్డ్యాం సైతం దెబ్బతినడంతో సమస్య మరింత తీవ్రమైంది.
ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు చాలాకాలంగా విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వంతెన నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపారు. ఈ క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి, రూ.75 లక్షల నిధులతో లోలెవెల్ వంతెన నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చారు.
ప్రస్తుతం వాగులో నీటి ప్రవాహం లేని పరిస్థితి ఉండటంతో పనులను వేగంగా ప్రారంభించి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు, సంబంధిత సిబ్బందికి సూచించారు. వంతెన నిర్మాణం పూర్తయితే నారాయణనగర్ పరిసర ప్రాంతాల్లోని వందలాది ఎకరాల వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులకు రాకపోకల సౌకర్యం మెరుగుపడటంతో పాటు, పంటల రవాణా కూడా సులభతరం కానుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ, రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలు, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రైతుల రాకపోకలు, పంటల రవాణాలో ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.
దీంతో నారాయణనగర్ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




