*అక్రమ గ్రావెల్ రవాణాపై ఉక్కుపాదం*
*సోమశిల ఉత్తర కాలువ వద్ద 8 ట్రాక్టర్లు సీజ్*
*అర్ధరాత్రి తనిఖీల్లో బయటపడిన అక్రమాలు.. కఠిన చర్యలు తప్పవన్న జేఈ హెచ్చరిక
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని సోమశిల ఉత్తర కాలువ వద్ద అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టగా, ఈ సందర్భంగా AMR సంస్థ ప్రతినిధులు, ట్రాక్టర్ యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం సోమశిల ఉత్తర కాలువ జేఈ మదనమోహన్ రావు కూడా అర్ధరాత్రే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి అధికారులతో కలిసి చర్యలు చేపట్టారు.
తనిఖీల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు గుర్తించిన 8 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జేఈ మదనమోహన్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ గ్రావెల్ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు, పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.


