
రోడ్డెక్కిన సూదలగుంట చెరకు రైతులు రూ.10 కోట్లకు పైగా ఎగనామం పెట్టిన యాజమాన్యం తిరుపతి మయూరా హోటల్ ఎదురుగా ఆందోళన రాజధానిని ముట్టడిస్తాం – బాధితుల హెచ్చరిక నెల్లూరు, (పున్నమి ప్రతినిధి) తీపి పండించే చెరకు రైతుల కష్టాలు కడు చేదుగా మారుతున్నాయి నెల్లూరు జిల్లాలో. ఇప్పటికే అతి పెద్ద సహకార ఫ్యాక్టరీ కోవూరు షుగర్స్ మూతపడిపోగా తాజాగా పొదలకూరు మండలం, సూదలగుంటలోని మయూరా గ్రూప్ షుగర్ ఫ్యాక్టరీ చక్కెర తయారీకి దూరమైంది. రైతులను నమ్మించి నట్టేట ముంచింది. పదుల కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి యాజమాన్యం ముఖం చాటేసింది. కార్మికుల చేత ఏడేళ్లు వెట్టి చాకిరి చేయించుకుని చేతులెత్తేసింది. దీంతో రైతులు, కార్మికులు బకాయిలు, వేతనాల కోసం రోడ్డెక్కారు. మయూరా గ్రూప్ ప్రధాన కేంద్రంగా ఉన్న తిరుపతిలో మయూరా హోటల్ ఎదుట నాలుగు రోజులుగా ఆందోళనకు దిగారు. రాత్రిపగలు అక్కడే ఉంటూ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం మాత్రం కనీసం స్పందించడం లేదు. ఇటు చెరుకు పండించిన రైతులు, అటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆకలి కేకలతో అల్లాడుతున్నా ఆ ఫ్యాక్టరీ ప్రధాన నిర్వాహకులు సూదలగుంట జయరామ్కృష్ణ చౌదరి, ఆయన కుమారుడు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్లు పత్తా లేరు. దీంతో రైతులు తిరుపతిలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కష్టాలు, నష్టాల బాటన పడుతున్న సమయంలో తానున్నానంటూ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామిరెడ్డి పొదలకూరు మండలం, ప్రభగిరిపట్నం వద్ద గాయత్రి షుగర్స్ పేరుతో 15 ఏళ్ల క్రితం ఫ్యాక్టరిని ప్రారంభించారు. పెద్దఎత్తున రైతులకు ప్రోత్సాహాలు ప్రకటించి, చెరకు సాగుకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలోను వేలాది ఎకరాల్లో రైతులు చెరకు సాగుచేశారు. సవ్యంగా ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో ధరల పతనం, ఇతర ఆర్ధిక ఇబ్బందులతో ఆ యాజమాన్యం ఫ్యాక్టరిని ప్రముఖ ఎరువుల కంపెనీ నాగార్జున ఫెర్టిలైజర్స్కు విక్రయించారు. కొన్నాళ్ల తరువాత ఆ యాజమాన్యం తమకున్న వ్యాపార ఒడంబడికల వత్తిడిలో ఫ్యాక్టరిని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ కె.ఎం.సి. నిర్వాహకుల్లో ఒకరైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ ఫ్యాక్టరిని తీసుకున్నారు. కొన్నాళ్ల తరువాత మేకపాటి సోదరులు ఈ ఫ్యాక్టరిని మయూరా గ్రూప్కు అప్పగించారు. కొద్ది రోజుల పాటు ఫ్యాక్టరిని క్రషింగ్ చేయించిన మయూరా నిర్వాహకులు చేతులెత్తేశారు. అప్పటి వరకు రైతులకు ఉన్న బకాయిలను చెల్లించి కె.ఎం.సి. ఫ్యాక్టరి నిర్వహణను నుంచి తప్పుకుంది. మేకపాటి సోదరుల నుంచి ఫ్యాక్టరిని తీసుకున్న మయూరా గ్రూప్ కొన్నేళ్లు సక్రమంగా నిర్వహించి ఆపై నిర్వాహకాన్ని ప్రదర్శించింది. నెల్లూరుతో పాటు కాళహస్తి,ఇతర ప్రాంతాలలో చెరకు క్రషింగ్ కలిగిన మయూరా గ్రూప్ ప్రభగిరిపట్నం పై సీత కన్ను వేసింది. దాంతో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల మేర రైతుల బకాయిలు, సుమారు కోటి రూపాయలకు పైగా కార్మికుల వేతనాలు నిలిపివేసింది. దీంతో రైతులు పలుమారులు ప్రశ్నించినప్పటికి స్పందన లేదు. ఇటీవల యాజమాన్యం ఫ్యాక్టరిని పూర్తిగా విస్మరించడంతో రైతులు, కార్మికులు రోడ్డెక్కారు. అప్పటికి స్పందన లేకపోవడంతో గత నాలుగు రోజులుగా మయూరా గ్రూప్ కేంద్రమైన తిరుపతిలోని మయూరా హోటల్ ఎదుట ఆందోళనను చేపట్టారు. తమకు చెల్లించాల్సిన బకాయిల పై యాజమాన్యం స్పందించకుంటే నేరుగా అమరావతిలో ఆందోళనకు దిగుతామని బాధిత రైతులు, కార్మికులు హెచ్చరిస్తున్నారు.