రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లిలో సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవనానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












