ఫెర్టిలైజర్ ‘దందా’ బయటపడుతుందనే భయమా?
ఆర్టీఐకి పాతరేస్తున్న వ్యవసాయ శాఖ?
రెండు నెలలైనా సమాచారం లేదు.. పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ యాక్టివిస్ట్ దుర్గం శరత్ చంద్ర డిమాండ్
హైదరాబాద్, జూలై 27: రాష్ట్రవ్యాప్తంగా ఫెర్టిలైజర్ (ఎరువుల) దుకాణాల వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు రెండు నెలలు గడిచినా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి సమాచారం అందించకపోవడంపై ఆర్టీఐ యాక్టివిస్ట్ దుర్గం శరత్ చంద్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలోని 33 జిల్లాల పరిధిలో ఉన్న ఫెర్టిలైజర్ షాపుల పూర్తి వివరాలను కోరుతూ హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు పూర్తి సమాచారం అందలేదని ఆయన తెలిపారు.
సమాచార హక్కు చట్టం–2005లోని సెక్షన్ 6(3) ప్రకారం సంబంధిత జిల్లాలకు దరఖాస్తును బదిలీ చేసినట్లయితే, ఆ బదిలీ ప్రతిని దరఖాస్తుదారునికి కూడా పంపాల్సి ఉంటుందని, అయితే అధికారులు ఆ నిబంధనను పాటించలేదని శరత్ చంద్ర ఆరోపించారు.
అలాగే తాను అడిగిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇవ్వకుండా అరకొర సమాచారంతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అధికారులు సమాచారాన్ని పూర్తిగా ఇవ్వకుండా జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
“అక్రమాలు లేకపోతే సమాచారాన్ని దాచాల్సిన అవసరం ఏముంది? అధికారుల్లో పారదర్శకత, నిజాయితీ ఉంటే రాష్ట్రంలోని అన్ని ఫెర్టిలైజర్ షాపుల పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలి” అని దుర్గం శరత్ చంద్ర డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఫెర్టిలైజర్ దుకాణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెల్లడించి, ఆర్టీఐ చట్టం ప్రకారం దరఖాస్తుదారునికి పూర్తి వివరాలు అందించాలని ఆయన కోరారు.


