ఖమ్మం, మే 7:
పున్నమి జిల్లా ఇంచార్జి
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్కు రానున్నారని తెలిపారు.
హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో 10 వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.
సభ విజయవంతం కోసం జిల్లాలో పర్యటిస్తున్న కొండపల్లి శ్రీధర్ రెడ్డి, నేలకొండపల్లి మండల కేంద్రంలో స్థానిక కార్యకర్తలతో కలిసి వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి నరేంద్ర మోదీ సభ కి కార్యకర్తల రాకపోకల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధాని మోదీ తొలిసారిగా హైదరాబాద్కు వస్తుండటంతో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.
మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్, జిల్లా నాయకులు మన్నే కృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శులు మల్లెబోయిన గోవిందరావు, బాజా రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పురాణం దివాకర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


