ఖమ్మం /ముదిగొండ, జూలై
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూమిలో ఏకపక్షంగా రహదారి నిర్మాణం జరుగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ శివారు నుంచి మున్నేరు వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో రహదారి ప్రారంభం నుంచి ఇరువైపులా సమానంగా భూమిని సేకరించాల్సి ఉండగా, కేవలం దేవాలయ భూమి వైపు నుంచే ఎక్కువ భూమిని తీసుకుంటున్నారని ఆరోపించారు.
దీంతో సుమారు రెండు ఎకరాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూమి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ సమస్యపై బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణను ముత్తారం గ్రామ పెద్దలు, యువకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ పెద్ద వనం అప్పాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో దేవాలయ భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎండోమెంట్స్ శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి దేవాలయ భూములను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమగాని ఎల్లారావు గౌడ్, నారపంగు కిరణ్, నారపొంగు జానీ, అడపా నాగేంద్రబాబు, కాలపొంగు వెంకటేశ్వర్లు, కాలపొంగు శ్రీను, కుక్కల దీపక్తో పాటు గ్రామానికి చెందిన పలువురు యువకులు పాల్గొన్నారు.



