యలమంచిలి సబ్ జైలులో ఆకస్మిక తనిఖీ.. ఉచిత న్యాయ సహాయంపై భరోసా
( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
అనకాపల్లి జిల్లా యలమంచిలి:
స్థానిక సబ్ జైలును మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, గౌరవ న్యాయమూర్తి శ్రీమతి పి. విజయ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. జైలులో ఉన్న ఖైదీలు, రిమాండ్ ముద్దాయిలను నేరుగా కలిసి వారి కేసుల వివరాలు, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారికి ప్రభుత్వ తరఫున ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ వకీళ్లను నియమించి, బెయిల్ ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జైలులో ఖైదీలకు అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర వసతులపై కూడా న్యాయమూర్తి ప్రత్యేకంగా ఆరా తీశారు. ఖైదీల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సబ్ జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ పి. సుబ్బారావు, జైలు సిబ్బంది, న్యాయస్థాన సిబ్బంది పాల్గొన్నారు.


