అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ పరిధిలోని ఒనుకొండ గ్రామంలో జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం పర్యటించింది. గ్రామంలోని ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రధానంగా మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వేసవి కాలంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.
ప్రజల సమస్యపై స్పందించిన చిట్టం మురళి వెంటనే సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి ఫోన్ చేసి ఒనుకొండ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వివరించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల నిత్యజీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. గ్రామ అభివృద్ధికి రహదారి నిర్మాణం ఎంతో అవసరమని మురళిని కోరారు.
*గెడ్డ అడ్డుగా.. బ్రిడ్జి కోసం గ్రామస్తుల డిమాండ్*
మరో ప్రధాన సమస్యగా గ్రామానికి వెళ్లే మార్గంలో గడ్డ అడ్డుగా ఉండటంతో బ్రిడ్జి అవసరం ఉందని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అక్కడ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరారు.
గ్రామస్తుల సమస్యలను ఓపికగా విన్న చిట్టం మురళి మాట్లాడుతూ, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అవసరమైన సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



