రాష్ట్ర ప్రభుత్వ ‘ఇందిరమ్మ టవర్స్’ గృహాల కేటాయింపు పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే అవకాశం ఉందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి ₹10,000 ఈఎండీ (EMD) చెల్లింపులు ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ ఫోన్ కాల్స్, వాట్సాప్ లింకులు, ఫేక్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.
ఈ పథకంలో ఎలాంటి మధ్యవర్తులు, బ్రోకర్లకు అవకాశం లేదని, గృహాల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇల్లు రాకపోతే ఈఎండీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోకి తిరిగి జమ చేస్తుందని తెలిపారు.
తెలియని వ్యక్తులు పంపే లింకులు క్లిక్ చేయొద్దని, APK ఫైళ్లు డౌన్లోడ్ చేయొద్దని, AnyDesk, TeamViewer వంటి యాప్లు ఇన్స్టాల్ చేయొద్దని సూచించారు. అలాగే ఆధార్, బ్యాంకు వివరాలు, OTP, UPI PIN ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.
పథకానికి సంబంధించిన సందేహాల కోసం 040-24603572 హెల్ప్లైన్ను సంప్రదించాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.



