ఆలయం కూల్చివేతపై విచారణ చేపట్టిన పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు
గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు – సంఘటన స్థలంలో పరిశీలన
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
కొంగరకాలన్ డివిజన్, 20 మే 2026:
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కొంగర కలాన్ 54వ డివిజన్ చింతపల్లి గూడ గ్రామంలో ఉన్న పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని అక్రమంగా కూల్చివేశారంటూ గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలు జీహెచ్ఎంసీ ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, చింతపల్లి గూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 9, 10, 11, 12లో గాజులబోడు ప్రాంతంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉండేదని పేర్కొన్నారు. ఈ ఆలయం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా ఉండి, ఎన్నో ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇటీవల ఆ ప్రాంతంలో “ప్రగతి టౌన్షిప్” పేరుతో వెంచర్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆలయాన్ని అక్రమంగా తొలగించారని గ్రామస్థులు ఆరోపించారు. తమ ఆరాధ్య దైవంగా భావించే దేవాలయాన్ని కూల్చివేయడం వల్ల గ్రామ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థుల ఫిర్యాదును స్వీకరించిన అనంతరం ఆదిభట్ల మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ బి.ఎన్.కే. రమేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆలయం కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్థులకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, పురాతన దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
ఈ కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక (డీసీవీ) రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు ఉడుతల రవి గౌడ్, జోగు స్వామి, జోగు జంగయ్య, శేరి రమేష్ తదితరులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






