హయత్నగర్లో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం… జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
పున్నమి న్యూస్
04 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
హైదరాబాద్, హయత్నగర్:
హయత్నగర్ లక్ష్మారెడ్డి పాలెం పరిధిలో జాతీయ రహదారి-65పై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమవగా, కార్లలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుండి భారీగా పెట్రోల్ లీక్ అవడంతో ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా పెట్రోల్ వాసన వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణమైనా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
అయితే ప్రమాద సమయంలో ట్యాంకర్ డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు కాస్త ఆలస్యమయ్యాయి. స్థానికులు, పోలీసులు కలిసి ఎంతో శ్రమించి డ్రైవర్ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. డ్రైవర్కు కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారి-65పై ఒక్క వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ను మళ్లించే చర్యలు చేపట్టారు. గంటల పాటు శ్రమించి రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్యాంకర్ అధిక వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో హయత్నగర్ లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.



