చుంచుపల్లి, ఆగస్టు 8 (పున్నమి ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో శనివారం బోనాల జాతర వైభవంగా జరిగింది. బస్టాండ్ ప్రాంతం నుంచి వందలాది మంది మహిళలు సంప్రదాయ పట్టుచీరలు ధరించి, తలపై బోనం కుండలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. అమ్మవారి వేషధారణలు, చేతిలో త్రిశూలాలతో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పుల చప్పుళ్లు, భక్తి పాటలతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రయాణికులు, వాహనదారులు అమ్మవారికి నమస్కరించారు. ఊరికి సుభిక్షం కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మహిళలు పూలమాలలు, ఆభరణాలతో అందంగా ముస్తాబై భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.



