ఆత్మకూరు రూరల్లో సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి
విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేసిన వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్
ఆత్మకూరు, సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు రూరల్ పరిధిలో రాత్రి వేళల్లో తరచుగా జరుగుతున్న విద్యుత్ కోతలను తక్షణమే నివారించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆత్మకూరు విద్యుత్ కార్యాలయంలో అధికారులను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో తరచుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి, రైతులు వ్యవసాయ పనులకు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.రూరల్ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిశీలించి, రాత్రి వేళల్లో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.వినతిపత్రంపై అధికారులు స్పందిస్తూ.. సమస్యను పరిశీలించి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు హరిబాబు, జైకుమార్, సురేష్, గంగయ్య, అశోక్, సిసింద్రీ తదితరులు పాల్గొన్నారు.


