ఖమ్మం, జూలై
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ )
ప్రజల దాహార్తి తీర్చే తాగునీరు, రైతుల సాగునీటి అవసరాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ఆరోపించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఆనవాళ్లను చెరిపివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఖమ్మం త్రీటౌన్ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు, రైతుల సాగునీటి ప్రయోజనాల కోసం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్మించిన మున్నేరు చెక్డ్యామ్ను రాత్రికి రాత్రే కూల్చివేయడం అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడుతున్న నిర్మాణాన్ని తొలగించే ముందు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని అన్నారు.
గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాంలో నిర్మించిన చెక్డ్యామ్లకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, అదే పరిస్థితిలో ఉన్న ఈ చెక్డ్యామ్ను మాత్రమే ఎందుకు కూల్చివేశారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజలకు మేలు చేసే అభివృద్ధి పనులను రాజకీయ కక్షసాధింపుతో ధ్వంసం చేయడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.



