కాంగ్రెస్.. బీఆర్ఎస్.. మీ రాజకీయ నాటకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి”
ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు – రవి పటేల్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయ పావులుగా వాడుకోవడం ఆపాలి
జయశంకర్ భూపాలపల్లి:
భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణం కావడం సరికాదన్నారు. ప్రజల మధ్య అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
“ఖబర్దార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులారా.. భూపాలపల్లిలో మీ రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి” అని రవి పటేల్ ఘాటుగా హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం కంటే ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలు వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్, బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్ప్లాన్ తదితర హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు.
బీఆర్ఎస్కు గత పాలనపై సమాధానం చెప్పే దమ్ముందా?
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో రోడ్లపైకి రావడం విడ్డూరంగా ఉందని రవి పటేల్ విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు తదితర అంశాల్లో పేద ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు బీఆర్ఎస్ నాయకులు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో తమను ప్రశ్నించిన ప్రజలు, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన వారు ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నట్లు మాట్లాడటం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
“బహుజనులు మేల్కొంటే మీ రాజకీయ పునాదులు కదులుతాయి”
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కేవలం ఎన్నికల సమయంలో రాజకీయ పావులుగా ఉపయోగించుకోవడం రెండు పార్టీలూ మానుకోవాలని రవి పటేల్ సూచించారు.
ఏ పార్టీలో ఉన్నా బహుజన నాయకులు తమ వర్గాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ అధికార సాధన కోసం నిస్వార్థంగా పోరాడుతుందని రవి పటేల్ స్పష్టం చేశారు.
భూపాలపల్లి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలను చట్టపరంగా నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, సురేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


