భూ బాధితులకు మద్దతిస్తే అరెస్టులా..? కాంగ్రెస్, బీజేపీ నేతల ఆగ్రహం
సీఎం సభ నెపంతో ముందస్తు అరెస్టులు.. రైతుల పక్షాన నిలిచిన వారిపై పోలీసుల చర్యలు
కోహెడ భూ బాధితులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం
పున్నమి న్యూస్
06 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
తుర్కయంజాల్: కోహెడ భూ బాధిత రైతులకు అండగా నిలిచినందుకే తమపై పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు కంబాలపల్లి ధనరాజ్, బండారు బాలప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. కోహెడ గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులమని కూడా చూడకుండా భూ బాధిత రైతులకు మద్దతు ఇచ్చామనే కారణంతో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒత్తిడితో తమను అరెస్టు చేయించారని ఆరోపించారు.
రైతుల హక్కుల కోసం, భూ బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ శాంతియుతంగా మద్దతు తెలుపుతుంటే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు వారిని ఆదుకోవాల్సింది పోయి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
రైతుల పక్షాన నిలబడిన వారిని భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. భూ బాధిత రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్య హక్కుల కోసం వెనక్కి తగ్గబోమని మాజీ కౌన్సిలర్లు తెలిపారు.




