నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శాఖ మేనేజింగ్ కమిటీ మాజీ సభ్యుడు, రక్తనిధి కేంద్రం మాజీ కోఆర్డినేటర్ బయ్యా ప్రసాద్, ఆయన కుమారుడు బయ్యా వినాయక సావర్కర్ కలిసి అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరమైన క్యాన్సర్ బాధితుల కోసం సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (SDP) అఫెరిసిస్ ద్వారా ప్లేట్లెట్స్ దానం చేశారు.
ఈ సందర్భంగా బయ్యా ప్రసాద్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను, నా కుమారుడు ఇద్దరం కలిసి ప్లేట్లెట్స్ దానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది” అని అన్నారు.
ప్రతి రక్తదాత సాధారణంగా మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చని, అలాగే వైద్యుల సూచనలు మరియు అర్హతలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (SDP) దానం చేయవచ్చని తెలిపారు.
వాతావరణ మార్పుల సమయంలో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రక్తానికి డిమాండ్ పెరుగుతుందని, రక్తనిధి కేంద్రాల్లో రక్త కొరత ఏర్పడకుండా యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని బయ్యా ప్రసాద్ పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ తమ మిత్రులు, బంధువులకు రక్తదానంపై అవగాహన కల్పించి, వారిని కూడా రక్తదాతలుగా ప్రోత్సహించాలని కోరారు. “ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్క రక్తదాత ముందుకు రావాలి. రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్లడ్ మోటివేటర్ సాయిరాం , బయ్యా సంగీతలక్ష్మి మరియు రక్తనిధి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


