అనపర్తి, జూలై 27(రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా వర్తింపజేయడంపై అనపర్తి మండలం పొలమూరులోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రయోజనం కల్పించడం పట్ల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంత ఊరట కల్పించడంతో పాటు, పిల్లల విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సన్మానించి, పథకం అమలుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


