ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వితే ఖబడ్దార్!
అక్రమ తవ్వకాలు, మట్టి రవాణాపై కఠిన చర్యలు
ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి, తహసీల్దార్ సునీతరెడ్డి హెచ్చరిక
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సీఐ ఎం. మహేందర్ రెడ్డి, తహసీల్దార్ సునీతరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు, రెవెన్యూ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై పోలీస్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిఘా కొనసాగిస్తున్నాయని తెలిపారు.
సీతారాంపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న ఒక ఇటాచి వాహనాన్ని సీజ్ చేశారు.
ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 588/2026 కింద U/S 303(2), 329(3) సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వడం, తరలించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
క్రిమినల్ కేసులు తప్పవు
అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై కేవలం వాహనాల సీజ్తో ఆగకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పదేపదే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రజలు సహకరించాలని, అక్రమ మట్టి తవ్వకాలు లేదా రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి అక్రమాలను ఉపేక్షించబోమని సీఐ మహేందర్ రెడ్డి, తహసీల్దార్ సునీతరెడ్డి స్పష్టం చేశారు.



