ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగంగా పూర్తిచేసి, నిర్ణీత గడువులోపు అభియోగపత్రాలను న్యాయస్థానంలో సమర్పించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారుల నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేర విచారణలో నిందితులకు శిక్షల శాతం పెరగడం అత్యంత ముఖ్యమని, అందుకు పకడ్బందీ దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, పోలీస్–ప్రాసిక్యూషన్ సమన్వయం కీలకమని పేర్కొన్నారు. కొత్త చట్టాల ప్రకారం ట్రయల్ను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, సాక్షులకు భరోసా కల్పించి న్యాయస్థానానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్డీపీఎస్ కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు అత్యంత కీలకమని పేర్కొన్న కమిషనర్, గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈగల్ బృందాలు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులతో సమన్వయంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చోరీ కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను త్వరగా గుర్తించి, దొంగిలించిన సొత్తును బాధితులకు తిరిగి అప్పగించేలా రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి కేసులో ఫోరెన్సిక్, డిజిటల్ సాక్ష్యాలను సమర్థంగా వినియోగించి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన కమిషనర్, నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు నివారణ చర్యలే సమర్థవంతమైన పోలీసింగ్కు నిదర్శనమని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సమావేశంలో శాంతిభద్రతలు, నేరాల ధోరణి, పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్, పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.



