- రైతు సంఘ నాయకుల ముందస్తు అరెస్ట్.. అనంతరం విడుదల
ఆత్మకూరు, జూలై 29: హరికిరణ్ (పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, వైఎస్సార్సీపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఐదు రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధానికి రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యమం ఉధృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బుధవారంనాడు ఆత్మకూరు సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసులు రైతు సంఘ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆత్మకూరు ఆర్డీఓ ఎదుట హాజరుపరిచి, తర్వాత ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
విడుదల అనంతరం రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ, తమ అరెస్టుపై ఎలాంటి బాధ లేదని, అయితే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం, పొగాకు బోర్డు విఫలమవడం బాధాకరమని అన్నారు. పొగాకు బోర్డు అధికారులు, కొనుగోలుదారుల వ్యవహార శైలి కారణంగానే రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రైతు సంఘ నాయకులు మూలి వెంకయ్య, గంటా లక్ష్మీపతి, లక్కు కృష్ణప్రసాద్, ఆత్మకూరు నాగయ్య, డేవిడ్ రాజు, వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు చండ్ర నారాయణస్వామి, బోయపాటి నాగేశ్వరరావు, రంతుల్లా, నారాయణ, నారయ్య తదితరులు పాల్గొన్నారు.


