ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ):
ఆన్లైన్లో నకిలీ పత్రాలు, నకిలీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పేరుతో విద్యార్థులకు శిక్షణలు అందిస్తామని నమ్మించి రూ.10 లక్షలు మోసం చేసిన కేసులో ఒక నిందితుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
కేసు వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ విద్యాసంస్థకు వాట్సాప్ ద్వారా తాను ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ అని పరిచయం చేసుకున్న నిందితుడు, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పాడు. ఇందుకోసం నకిలీ పత్రాలు, నకిలీ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) పంపించి, సంస్థ నుంచి రూ.10 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో నిందితుడు, బ్యాంకు ఖాతాదారుడైన **డి. రవికిరణ్ (26)**ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఖమ్మం సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు కమిషనర్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్, సీఐ భూక్యా రవికుమార్, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, కానిస్టేబుళ్లు కృష్ణారావు, నాగేశ్వరరావు మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.



