త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్రవారం దుత్తలూరు మండల స్థాయిలో భగవద్గీత శ్లోకాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
పోటీల్లో మొదటి బహుమతిని దుత్తలూరు ZPHS పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి సి.హెచ్. గౌతమ్ కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతి దుత్తలూరులోని సిద్ధార్థ స్కూల్ 9వ తరగతి విద్యార్థి పి. మురారికి లభించింది. మూడవ బహుమతిని KGBV పాఠశాల 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీదేవి అందుకున్నారు.
అనంతరం విజేతలకు బహుమతులను మండల స్థాయి నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దుత్తలూరు మండల నాయకులు మధుసూధన్ రెడ్డి, దుత్తలూరు మండల జనసేన మాజీ అధ్యక్షుడు దుంపలగడ్డ రవికుమార్, ప్రబోధ సేవా సమితి అధ్యక్షుడు జి. ప్రసాద్, జి. పెంచల రత్నం, కె. నరసింహులు, కె. వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు జి. పెంచల రత్నం కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించి, కార్యక్రమానికి విచ్చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల్లో భగవద్గీతపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు.
ప్రబోధ సేవా సమితి – దుత్తలూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.



