వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ఇప్పుడు విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం: తుమ్మల చంద్రారెడ్డి
ఆత్మకూరు, జూలై 14 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు పట్టణంలో తాగునీటి సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్లపాటు అధికారంలో ఉండి మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి విమర్శించారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఆత్మకూరు పట్టణ అభివృద్ధి పూర్తిగా వెనుకబడిందన్నారు. రాష్ట్రంలోనూ, మున్సిపాలిటీలోనూ అధికారంలో ఉన్నప్పటికీ కనీసం ఒక్క ప్రధాన రహదారి కూడా నిర్మించలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఆత్మకూరు పట్టణానికి సోమశిల ప్రాజెక్టు నుంచి 45 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోందని గుర్తు చేశారు. గతంలో వైసీపీ నాయకుడు రవీంద్రారెడ్డి ఆర్ అండ్ బి రోడ్డులో ఆక్రమణ చేసి బోరు వేయడం వల్ల ప్రధాన పైప్లైన్ దెబ్బతిన్నదని ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన నష్టం కారణంగానే ప్రస్తుతం కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. పైప్లైన్ మరమ్మతులకు అవసరమైన ప్రత్యేక జాయింట్ను చెన్నై నుంచి తెప్పించి కేవలం రెండు రోజుల్లోనే మరమ్మతు పనులు పూర్తి చేశామని వివరించారు.మరమ్మతుల అనంతరం సోమశిల ప్రాజెక్టు వద్ద మోటార్లను తిరిగి ప్రారంభించిన తర్వాత ప్రారంభ దశలో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, మంగళవారం నుంచి యథావిధిగా ప్రతి వార్డుకు తాగునీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని చంద్రారెడ్డి విమర్శించారు. సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు చేయకుండా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అనేక అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ పరిటాల సత్యం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సర్దార్, ఆత్మకూరు రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుంకర పెంచలయ్య, మాజీ వార్డు కౌన్సిలర్లు సురా భాస్కర్ రెడ్డి, గౌస్ పాషా, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


