గురువుల దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ అభినందన సభ
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 05: గురువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువుల పట్ల తమకున్న గౌరవం, కృతజ్ఞతలను చాటుకుంటూ ఆంధ్ర హైస్కూల్, ఖర్గపూర్, పశ్చిమ బెంగాల్ పూర్వ విద్యార్థులు ఘనంగా గురు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శనివారం కంబాలకొండ ఎకో వనంలో నిర్వహించిన ఈ ఆత్మీయ అభినందన సభలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన శ్రీ జె . కే . పట్నాయక్ , శ్రీ సి హె చ్ . జగదీశ్వర్రావు , శ్రీ వి . ఉమామహేశ్వర్ రావు గార్లను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువుల సేవలను, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో వారు పోషించిన పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థులు, గురువుల సమక్షంలో ఆత్మీయ విందు భోజనం ఏర్పాటు చేశారు.
అలాగే ఉదయం శ్రీమతి సరస్వతి టీచర్ ని వారి నివాసంలో కలిసి గురువుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. అనంతరం శ్రీ పి . జె . రావు టీచర్ ని ఫాదర్ & మదర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కలిసి వారి ఆశీస్సులు పొందడంతో పాటు ఘనంగా సన్మానించారు.
గురువు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి మాత్రమే కాదు… జీవితానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి అని పేర్కొంటూ, తమ గురువులను ఏళ్ల తరువాత కూడా మరచిపోకుండా సన్మానించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమం గురు-శిష్యుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి, గురువుల పట్ల పూర్వ విద్యార్థుల కృతజ్ఞతాభావానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ రామకృష్ణ, ఉమశంకర్ రెడ్డి, మధుసూదన్, రెడ్డి, నటరాజ్ మరియు తదితరుల ఆధ్వర్యములో జరిగినది


