ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మిక్కిలినేని నరేంద్ర కలిసి ఖమ్మం నగరంలోని 6వ, 46వ, 54వ డివిజన్ల పరిధిలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
అనంతరం ఆలయాలకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీర్వాదాలు పొందారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళలాడగా, భక్తి గీతాలు, ప్రత్యేక హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గురువుల పట్ల గౌరవం, సేవాభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని, గురు పౌర్ణమి భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సేవా భావాన్ని పెంపొందించేందుకు అన్నదాన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



