తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని, ఆయన త్వరలో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేరుగు చందర్ యాదవ్ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరాహస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న చేపట్టనున్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించాలని, పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. కమాన్పూర్ లోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉందని స్థానిక భక్తుల విశ్వాసం. స్వామివారు సాధారణ విగ్రహ రూపంలో కాకుండా పెద్ద బండరాయిపై స్వయంభూ గా వెలిశారని భక్తులు నమ్ముతారు. ఒక మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో ఇక్కడ వెలిశారని పురాణ కథనం ఉందని నాయకులు తెలిపారు. బండరాయిపై ఉన్న స్వామివారి ఆకారం కాలక్రమేణా పెరుగుతుందని, రాతిపై వెంట్రుకల ఆకారం కనిపించడం ఆలయ ప్రత్యేకతగా భక్తులు భావిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా గుడి, గోపురం లేకుండానే ప్రకృతి మధ్యలో స్వామివారు పూజలు అందుకోవడం ఈ క్షేత్రం విశిష్టతగా చెబుతున్నారు. భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు స్వామివారి వద్ద టెంకాయ ముడుపు కడితే తమ సమస్యలు తొలగిపోతాయని భక్తుల్లో విశ్వాసం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కారణంగా ఆదివరాహ స్వామిని భక్తులు ‘వరాల స్వామి’ గా కొలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేరుగు చందర్ యాదవ్, జిల్లా జాయింట్ సెక్రటరీ కాంపెల్లి స్వామి, జిల్లా సెక్రటరీ కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు వెంగల కృష్ణ, పెద్దపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల ప్రశాంత్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


