ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు సాగుతున్న విశ్రాంత ఉపాధ్యాయుడు
ఆత్మకూరు, పున్నమి ప్రతినిధి : ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలోని ఎల్.ఆర్.పల్లి నివాసి, విశ్రాంత ఉపాధ్యాయుడు బి. శ్రీనివాసులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసే ఆలోచనతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.బాల్యం నుంచే వామపక్ష భావజాలం పట్ల ఆసక్తి పెంచుకున్న శ్రీనివాసులు.తాను విశ్వసించిన సిద్ధాంతాలకు అనుగుణంగా సామాజిక అంశాలపై స్పందిస్తూ వచ్చారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించడం ఆయనకు అలవాటుగా మారింది.ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాలంలో విద్యార్థులకు తనదైన బోధనా విధానంలో విద్యను అందిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేశారు. పదవీ విరమణ అనంతరం కూడా ప్రజా సమస్యలపై ఆసక్తి కొనసాగిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. ఎల్.ఆర్.పల్లిలో తనకు ఉన్న చిరకాల పరిచయాలు, స్థానిక ప్రజలతో ఉన్న అనుబంధం ద్వారా వార్డు పరిధిలోని సమస్యలను తెలుసుకుంటున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. ప్రజల అవసరాలను సమీపంగా తెలుసుకుని, వాటిపై తన వంతుగా స్పందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ రాజకీయంగా తన తదుపరి అడుగులపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధి అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రజలను కలవాలని భావిస్తున్నట్లు సమాచారం.ఎన్నికల నేపథ్యంలో ఎల్.ఆర్.పల్లి వార్డులో వివిధ వర్గాలకు చెందిన ఆశావహులు, నాయకులు ప్రజలను సంప్రదిస్తుండటంతో స్థానిక రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.


