డీఎస్సీపై వైసీపీకి కావాల్సింది అరెస్టులే: బీద రవిచంద్ర
డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై శాసన మండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర స్పందించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కేసులు ఎందుకు నమోదు చేయడం లేదన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ నాయకులకు కావాల్సింది అరెస్టులే. ప్రభుత్వం ప్రశ్నించినందుకు పోలీసులు ఇళ్లపైకి వచ్చారని, తమను అరెస్ట్ చేశారని చెప్పుకొని రాజకీయ సానుభూతి పొందాలని చూస్తున్నారు. అనిల్కుమార్ యాదవ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తామే ముందుగా అరెస్ట్ కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అరెస్టుల విషయంలో కూడా వారిలో పోటీ కనిపిస్తోంది” అని విమర్శించారు. అయితే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం ఇస్తామన్నారు. ప్రజలకు మెరుగైన పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడం, విద్యారంగాన్ని బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆరోపణలు, అరెస్టుల రాజకీయాలకంటే ప్రజా సంక్షేమం, అభివృద్ధి, యువత భవిష్యత్తే తమకు ముఖ్యమని బీద రవిచంద్ర స్పష్టం చేశారు.


