ప్రభుత్వ భూమిలో పంద్రాగస్టు వేడుకలా?
ప్రభుత్వ భూమిలో పంద్రాగస్టు వేడుకలా? రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు ఆదిభట్ల: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీ మునగనూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔటర్ రింగ్రోడ్డుకు అంతర్భాగంలో ఉన్న సర్వే నంబర్లు 90, 91లో సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిపై అక్రమ కబ్జాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే భూమిలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. భూమిని దక్కించుకునేందుకు కొందరు తప్పుడు సమాచారం అందిస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన కొందరు అధికారులు, రాజకీయ నాయకుల పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే హైడ్రా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు వాస్తవమా? అధికారులు స్పందిస్తారా? ప్రభుత్వ భూములపై పూర్తి స్థాయి విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.


