విన్నమాల వద్ద జరిగిన హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు
పున్నమి న్యూస్ నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని 2021 సంవత్సరం విన్నమాల వద్ద జరిగిన హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు సోమవారం గూడూరు అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2021 నవంబర్ 17న విన్నమాల వద్ద ఫిర్యాదిదారుడి కుటుంబానికి, ముద్దాయిల కుటుంబానికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో అరవ శ్రీనివాసులు, శీనయ్యపై ముగ్గురు ముద్దాయిలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందారు. ఈ ఘటనపై అప్పటి నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ వై.వి. సోమయ్య దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కేసులో పేర్నాటి సాగర్, పేర్నాటి బెనహర్, పేర్నాటి అనిల్ నేరం రుజువు కావడంతో గూడూరు అదనపు జిల్లా న్యాయస్థానం ముగ్గురికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు IPS ఆదేశాలు, నాయుడుపేట డీఎస్పీ మార్గదర్శకత్వంలో పోలీసులు కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు. కోర్టు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత్ కుమార్ వాదనలు వినిపించగా, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడంలో నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తదితరులు సహకరించారు.


