అంబేద్కర్ జయంతి నాడు మద్యనిషేధ దినంగా ప్రకటించాలి… బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గగనం వెంకటస్వామి
పున్నమి: రంగారెడ్డి జిల్లా: ఘట్కేసర్, అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గగనం వెంకటస్వామి ప్రభుత్వాన్ని కోరారు. మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజని ఆయన పేర్కొన్నారు. ఈ రోజున మద్యం విక్రయాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ జయంతి రోజున మద్యం దుకాణాలు, బార్లు తదితర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ జయంతిని ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని గగనం వెంకటస్వామి కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్ను సానుకూలంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


