బిజినేపల్లి(నాగర్కర్నూల్): మండల పరిధిలోని సల్కరిపేట గ్రామంలో పాముకాటుతో ఒకే ఒక్క కుమారుడు మృతి చెందడంతో ఓ కుటుంబంలో తీరని శోకం వ్యక్తమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల బంగారయ్య, అంజనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు చరణ్ (10) ఉన్నారు. శుక్రవారం రాత్రి చరణ్ ఇంటి ముందు నిద్రిస్తుండగా అర్ధరాత్రి వేళ కట్లపాము కాటువేసింది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు బాలుడిని నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.


