నందలూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలోని ఉర్దూ పాఠశాల విద్యార్థులకు మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు వక్ఫ్ బోర్డు మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ అమీర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు విద్యార్థి దశ నుంచే వ్యాస రచన, ఇతర సృజనాత్మక పోటీల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందించుకోవచ్చన్నారు. మంచి ప్రవర్తన, క్రమశిక్షణతో కూడిన విద్యే సమాజానికి నిజమైన వెలుగునిస్తుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ మానవ హక్కుల (వరల్డ్ హ్యూమన్ రైట్స్) స్టేట్ మైనారిటీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, సమాజ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పఠాన్ మెహర్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


