డీఎస్సీ నియామక ప్రక్రియపై తప్పుడు, విష ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం తక్షణమే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా వెంకట నరసయ్య కోరారు. సోమవారం ఒంటిమిట్టలో ఆయన మాట్లాడారు.డీఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని, దీనిపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కొంతమంది నిరుద్యోగులను ముందుపెట్టి ఆర్గనైజ్డ్గా తప్పుడు ప్రచారం చేయిస్తూ మంత్రి నారా లోకేష్పై దుష్ప్రచారం చేస్తున్నారని నరసయ్య విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రచారంపై ప్రభుత్వం, సీఐడీ విభాగం ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన 14 డీఎస్సీల ద్వారా సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు.మరో మూడు నెలల్లో మరో 3,000 డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నారా లోకేష్ ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోందని తెలిపారు. ఈ పరిణామాన్ని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నరసయ్య హెచ్చరించారు.


