ఖానాపూర్, ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి ): పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి కారణాలతోనూ నిలిపివేయరాదని డిమాండ్ చేశారు. ఈ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
అనంతరం తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను కాపాడేందుకు, ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా గంగన్న, కౌన్సిలర్, మాజీ ఎంపీటీసీ శ్రావణ్, సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ రాము నాయక్, మాజీ ఎంపీపీ అబ్దుల్ మోహిత్, మాజీ వైస్ ప్రెసిడెంట్ వాల్ సింగ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.



