ఆత్మకూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ఏఎస్ పేట ఎస్సై జిలానిని ఉత్తమ అధికారి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా ఎస్సై జిలాని ప్రతిష్టాత్మక ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు.
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో పనిచేసినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఎస్సై జిలానికి వరుసగా మూడోసారి ఉత్తమ అధికారి అవార్డు లభించడం విశేషం. వరుసగా మూడు సంవత్సరాలు ఉత్తమ అధికారి అవార్డులు అందుకోవడం ఆయన విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధతకు, సేవా తీరుకు నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు ఎస్సై జిలానిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ మరింత అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎస్సై జిలాని తెలిపారు.


