పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రాయవరం గ్రామంలోని తుమ్మపెళ్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఆర్. రత్యానాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.నాసరయ్య, ఎన్. మేరీ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు దేశభక్తి, స్వాతంత్ర్య ఉద్యమ ప్రాధాన్యతను వివరించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని, సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాటం చేశారని తెలిపారు. భగత్సింగ్ తన త్యాగంతో యువతలో దేశభక్తిని రగిలించారని, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి పోరాడిన మహావీరుడని వివరించారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
విద్యార్థులకు శ్రీనివాస్ ప్రమోద్ సేవాభావం
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న శ్రీనివాస్ ప్రమోద్ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను బహుకరిస్తూ విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన చేస్తున్న సేవలను ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.




