ఓబులవారిపల్లి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలోని పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రజలు, విద్యార్థులు, యువత కలిసి పనిచేయాలని కోరారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తితో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటడం మంచి కార్యక్రమమన్నారు. నేడు నాటే మొక్కలు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం ఎందరో వీరుల త్యాగాల ఫలితమని, దేశాన్ని, పుట్టిన గడ్డను, సంస్కృతిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



