అర్హులందరికీ ఓటు నమోదు – డీఆర్ఓ సిహెచ్.సత్తిబాబు
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ,ఆగస్టు 13.(పున్నమి ప్రతినిధి )
అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటును తొలగించే ప్రసక్తే లేదని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సీహెచ్ సత్తిబాబు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
గత నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. జాబితాలో పేరు లేని అర్హులు అవసరమైన ఆధారాలతో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని వారికి ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించిందని, నిర్దేశించిన 12 పత్రాల్లో ఏవైనా రెండు పత్రాలు సమర్పించి తమ ఓటును పునరుద్ధరించుకోవచ్చని చెప్పారు.
పేర్లలో అక్షరదోషాలు లేదా ఇతర తప్పులు ఉన్నవారు ఆధార్, బీఎల్ఓ డిక్లరేషన్తో వాటిని సరిచేసుకోవచ్చన్నారు. జిల్లాలో సుమారు 1.93 లక్షల మంది ఇలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసులు అందుకున్న వారు అవసరమైన ఆధారాలు సమర్పించి తమ ఓటును పునరుద్ధరించుకోవాలని కోరారు.
కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6 ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా యువ ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్ఓ సత్తిబాబు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.


