తెలంగాణలో ‘డయల్ 100’కు గుడ్బై.. ఇకపై అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్ – 112
పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలన్నీ ఒకే కాల్తో అందుబాటులోకి.. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ‘డయల్ 112’ ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు రాష్ట్ర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పోలీసు సహాయం కోసం ఉపయోగిస్తున్న డయల్ 100 స్థానంలో ఇకపై డయల్ 112ను ప్రధాన అత్యవసర సేవా నంబర్గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త వ్యవస్థను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అధికారికంగా ప్రారంభించారు.
కొత్త TG-ERSS (Telangana Emergency Response Support System) ద్వారా పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక, మహిళల భద్రత, బాలల రక్షణ, విపత్తు నిర్వహణ తదితర అత్యవసర సేవలను ఒకే నంబర్ 112 ద్వారా పొందే అవకాశం కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వేర్వేరు నంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే కాల్తో సంబంధిత శాఖలకు సమాచారం చేరే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఈ నూతన వ్యవస్థలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతికతను వినియోగించారు. డూప్లికేట్ కాల్లను గుర్తించడం, అత్యవసరతను బట్టి కాల్లకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలర్ ఉన్న ప్రదేశాన్ని వేగంగా గుర్తించడం, సమీపంలోని అత్యవసర వాహనాలను వెంటనే పంపించడం వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దీంతో స్పందన సమయం మరింత తగ్గి ప్రజలకు వేగంగా సహాయం అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, “ఒక దేశం – ఒకే అత్యవసర నంబర్ 112” అనే భావనతో తెలంగాణలో ఈ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ 112ను గుర్తుంచుకుని వినియోగించాలని, ఈ నంబర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.




