కడప, ఆగష్టు 4 (పున్నమి ప్రతినిధి): కడప నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ పి. భవాని ప్రసాద్ చేపట్టిన మార్నింగ్ విజిటింగ్ కార్యక్రమంలో.. ఎస్బీఐ కాలనీ, కృపా కాలనీ, బుడగజంగం కాలనీ, లోహియానగర్ లలో నెలకొన్న సమస్యలను స్థానిక న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పాస్టర్ పి.మహేష్ మాట్లాడుతూ… వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతాల ప్రజలు అక్షరాలా నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మృగ్యమైందని తెలిపారు. దీనివల్ల మురికి నీరు నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో భారీగా నిల్వ ఉంటున్నాయని, మురికి నీరు ఎక్కడికక్కడ నిలబడిపోవడంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని, విపరీతంగా పెరిగిన దోమల బెడదతో చిన్నారులు, వృద్ధులు రకరకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో చాలా హిబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతానికి బుడగజంగం కాలనీ, కృపా కాలనీ విద్యార్థుల కోసం ఎస్బిఐ కాలనీ లో మురికి నీరు పోయేందుకు పైపు ఏర్పాటు చేసి, చిప్స్ రోడ్డు అయిన వేయాలన్నారు. గడచిన ఏళ్లుగా ఈ ప్రాంతాల దుస్థితిని ఎంతోమంది ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పరిశీలించి వెళుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని పాస్టర్ మహేష్ అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, నాయకులు మారుతున్నా ఈ పేదల కాలనీల అభివృద్ధి మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని వాపోయారు. కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీ సమస్యలను తాత్కాలిక మరమ్మతులు కాకుండా ఎస్బిఐ కాలనీ, కృపా కాలనీ, బుడగజంగం కాలనీ, లోహియానగర్ వాసుల దీర్ఘకాలిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన పటిష్టమైన మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించి సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మురికి నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఈ పేదల కాలనీలను ఆదుకోవాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు స్థానిక ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



