సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కలవనీయకుండా పోలీసుల అత్యుత్సాహం
వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపాటు
పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 30
అఘాయిత్యాలకు బలై ఆత్మహత్య చేసుకున్న సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అత్యంత అప్రజాస్వామికంగా నిర్బంధించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇటీవల అన్యాయానికి గురై ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చేందుకు గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి రామచంద్రపురం మండలం రాయలచెరువు పేట గ్రామం మృతుడి నివాసానికి బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ముందుగానే రంగప్రవేశం చేసి ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు.
అయినప్పటికీ పోలీసుల వలయాలను ఛేదించుకుంటూ మృతుడి నివాసానికి చేరుకున్న భూమన కరుణాకర్ రెడ్డిని, అక్కడికక్కడే పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. స్థానిక ఎమ్మెల్యే పునువర్తి నాని ప్రత్యక్ష ఆదేశాల మేరకే పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైయస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే అడ్డుకోవడం ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని నాయకులు మండిపడ్డారు. పోలీసుల అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వ తీరుపై భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలిపి మృతుడి నివాస ప్రాంతం నుంచి వెనుతిరిగారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



