చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకం కావొచ్చు – సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే హెచ్చరిక
విద్యుత్ భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
ఆసిఫాబాద్, జూలై 29:
వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ మన జీవితానికి అత్యంత అవసరమైన శక్తి అయినప్పటికీ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. గృహ వినియోగదారులు, రైతులు, విద్యార్థులు, పశువుల కాపరులు, ప్రజలందరూ విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
వర్షం సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, స్టే వైర్లు, తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని తెలిపారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని సూచించారు.
గృహ వినియోగదారులు తడి చేతులతో స్విచ్లు, ప్లగ్లు, మీటర్ బోర్డులు, మోటార్లు, గీజర్లు వంటి విద్యుత్ పరికరాలను తాకరాదని, ఇంటి వైరింగ్కు తప్పనిసరిగా నాణ్యమైన ఎర్తింగ్ చేయించాలని పేర్కొన్నారు. ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలు మాత్రమే ఉపయోగించాలని, పాడైన వైర్లను వెంటనే మార్చించాలని, మరమ్మతులు అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్తోనే చేయించాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో రైతులు మోటార్లు, స్టార్టర్లు, పైపులు, పంపుసెట్లకు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ లైన్ల క్రింద ఇనుప పైపులు ఎత్తేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ భూముల్లో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమే కాక ప్రాణాంతకమని హెచ్చరించారు. చేపల వేట లేదా వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు.
పిల్లలను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ బోర్డుల వద్ద ఆడనివ్వకూడదని, పశువులను విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్ఫార్మర్లకు కట్టరాదని సూచించారు. విద్యుత్ షాక్కు గురైన వ్యక్తిని నేరుగా చేతులతో తాకకుండా, విద్యుత్ ప్రసారం చేయని వస్తువులతో వేరు చేసి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి వైద్య సహాయం అందించాలని వివరించారు.
కొత్త భవనాల నిర్మాణ సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.2 మీటర్ల భద్రతా దూరం పాటించాలని, విద్యుత్ చౌర్యానికి పాల్పడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
తెగిపోయిన విద్యుత్ తీగలు లేదా ఇతర లోపాలు గమనించిన వెంటనే సమీప టీజీఎన్పీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఉత్తమ్ జాడే ప్రజలను కోరారు.
“విద్యుత్తో అప్రమత్తంగా ఉండండి… సురక్షితంగా జీవించండి… సురక్షితంగా వ్యవసాయం చేయండి” అంటూ ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు.


