సాయి కృష్ణ రెడ్డి లెగసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 18న ఉచిత వైద్య శిబిరం
“ప్రజల ఆరోగ్యానికి బీఆర్ఆర్ ఫౌండేషన్ చేయూత.. యాచారంలో భారీ ఉచిత వైద్య శిబిరం
యాచారం, జూలై 16:
ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో సాయి కృష్ణ రెడ్డి లెగసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల జూలై 18, 2026న యాచారం గ్రామపంచాయతీ ఆవరణలో భారీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుంది.
ఈ వైద్య శిబిరంలో ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలు, స్త్రీ మరియు గర్భిణీ సంబంధిత వైద్య సేవలు, పిల్లల వైద్య సేవలు, కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్ వైద్య సేవలు, రక్తపోటు–షుగర్ పరీక్షలు, ఊపిరితిత్తుల సంబంధిత పరీక్షలు వంటి పలు ఆరోగ్య సేవలను ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి నిపుణుల సలహాలు, తదుపరి చికిత్సకు సూచనలు కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈ శిబిరంలో పయనీర్ హాస్పిటల్స్, రష్కేర్ హాస్పిటల్, సదురామ్ ఐ హాస్పిటల్స్ వైద్య నిపుణులు పాల్గొని సేవలు అందించనున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాడిదె రామ్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని ఆయన కోరారు.
అన్ని వయసుల వారు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.



