పోక్సో కేసుపై కక్ష.. ఒకే రాత్రిలో ఆరుగురి హత్య
భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు బాధిత కుటుంబంపై కత్తితో దాడి.. షాబాద్ మండలం దైవాలగూడలో దారుణ ఘటన
షాబాద్ | జూలై 11
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తనపై నమోదైన పోక్సో కేసుపై కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి, బాధిత కుటుంబంలోని ముగ్గురిని కిరాతకంగా హత్య చేసిన అనంతరం, తన ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒకే రాత్రిలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన రాజ్కుమార్పై గతంలో ఓ మైనర్ బాలిక కుటుంబం పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం జైలుకు వెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబంపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
శనివారం అర్ధరాత్రి సమయంలో నిందితుడు ముందుగా బాధిత కుటుంబంపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక తల్లి, నానమ్మపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం బాలికను గ్రామ శివారుకు తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అంతటితో ఆగకుండా నిందితుడు తన ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్య సరిత (28), ఇద్దరు చిన్న కుమారులపై కూడా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్, సీఐ కాంతారెడ్డి తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంబంధిత ఆసుపత్రులకు తరలించి, గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.



