వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమీక్ష!
వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమీక్ష. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులకు హెచ్చరిక.
వింజమూరు: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలోని పెండింగ్ రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కిస్తిపురం గ్రామానికి చెందిన ఓ మహిళా టీడీపీ కార్యకర్త పొలానికి వెళ్లే ప్రభుత్వ బాటను కొందరు ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని ఎమ్మార్వోను ఆదేశించారు. మండలంలోని ఇతర గ్రామాల్లో ఉన్న భూ, రెవెన్యూ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని సూచించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలను దశలవారీగా సందర్శిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


