తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూన్ 29:
తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పౌర్ణమి పూజలు, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ఆడపడుచులు ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొండూరి మురళీకృష్ణ–కృష్ణవేణి దంపతులు ప్రతిష్ఠించిన పోతురాజు స్వామి విగ్రహాన్ని వేదమంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మావుళ్లమ్మ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు యువ నాయకుడు అల్లూరి విక్రమాదిత్య హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మావుళ్లమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
అదే సందర్భంగా ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 575 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సింహాద్రి ప్రణీత గాయత్రిని మావుళ్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, విద్యలో రాణిస్తూ వారికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, యువకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.


