వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆత్మకూరులో భారీ నిరసన ర్యాలీ
ఆత్మకూరు , జూన్ 12 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మేకపాటి విక్రమ్ రెడ్డి నాయకత్వం వహించారు.తొలుత ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ నాయకులు, కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, బాండ్ పేపర్లు, గ్యారంటీల పేరుతో నమ్మబలికిందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారని, ఇంధన ధరల భారాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం అనేక ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ హామీల అమలు ఎంతవరకు జరిగిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం ఇచ్చిన హామీలపై గ్రామ గ్రామాల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని మేకపాటి విక్రమ్ రెడ్డి ఆరోపించారు. హైలెవల్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదని, సోమశిల ఆఫ్రాన్ పనులు ప్రారంభించలేదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కీలకమైన అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ప్రకృతి వనరుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకే చెందాలని, వాటి పరిరక్షణకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



